Friday, April 24, 2020

భారత దేశంలో రోగిష్టి నియంతృత్వం

భారత దేశంలో రోగిష్టి నియంతృత్వం
Posted On: Friday,October 11,2019
భారత దేశంలో రోగిష్టి నియంతృత్వం
- అఖీల్‌ బిల్‌గ్రామీ
(అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొదిన భారతీయ తత్వవేత్త, మేధావి అఖీల్‌ బిల్‌గ్రామీ ట్రై కాంటి నెంటల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ రిసెర్చ్‌కు చెందిన జిప్సన్‌ జాన్‌, జితీష్‌ పి.ఎం లకు ఇటీవల ఇచ్చిన సూదీర్ఘ ఇంటర్వ్యూ సారాంశంలో రెండో భాగం ఇది.మొదటి భాగం గత సంచికలో ప్రచురించబడింది....సంపాదకుడు)

             సోషల్‌ డెమోక్రసీని అధికారంలోకి రానీయకుండా లిబరలిజం దుర్మార్గమైన పాత్ర నిర్వహిస్తోంది. సమాజాన్ని మౌలికంగా మార్చడానికి కావలసిన సంభావనలు (కాన్సెప్ట్స్‌) కార్మిక ప్రజలకు అందకుండా చేయడం ద్వారా అది మార్పుకు అడ్డుపడుతోంది. అయితే దానర్ధం సోషల్‌ డెమోక్రసీ సమాజాన్ని మారుస్తుందని కాదు. ఎందుకంటే సోషల్‌ డెమోక్రసీ ఎన్నడూ పెట్టుబడిదారీ వ్యవస్థను మౌలికంగా విమర్శించదు. ఈ అంశాలే చాలా కాలంగా భారత దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ వామపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు కారణమవుతున్నాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థపై సోషల్‌ డెమోక్రసీ విధించిన నియంత్రణలు ఏవైతే ఉన్నాయో వాటిని 20వ శతాబ్దంలో లిబరలిజం తన స్వంతం చేసుకుంది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థను మౌలికంగా విమర్శించడానికి లిబరలిజం ఈ విధంగా చేయలేదన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సోషల్‌ డెమోక్రసీని నీరుగార్చడానికే లిబరలిజం దాన్ని స్వంతం చేసుకుంది. ప్రభాత్‌ పట్నాయక్‌ ఈ విషయాన్ని నేరుగా పేర్కొనకపోయినా నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో దీనికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. ''పెట్టుబడిదారీ వ్యవస్థలో సద్యోజనిత (స్పాంటేనియస్‌) ధోరణలు'' పెట్టుబడిపై నియంత్రణలు శాశ్వతంగా ఉండడానికి ఆమోదించవని పట్నాయక్‌ చెప్పారు. ఇక్కడ స్పాంటేనియస్‌ అంటే స్వేచ్ఛకు విరుద్ధమైన పదం. నిర్ధారితం (డిటర్మినిస్టిక్‌) అని అర్ధం. అంటే పెట్టుబడిపై శాశ్వత నియంత్రణలు పెట్టే స్వేచ్ఛ మనకు లేదన్న మాట. ఈ మొత్తం అంశాన్ని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు: నీవు పెట్టుబడిదారీ వ్యవస్థను అదిగమించనైనా అదిగమించాలి లేకుంటే పెట్టుబడిదారీ వ్యవస్థే నిన్ను (అంటే నీవు దానిపై విధించిన నియంత్రణలను) బలహీనపరుస్తుంది. అంటే ఆధునిక కాలంలో మనకు పెట్టుబడిదారీ చట్రాన్ని నియంత్రించే స్వేచ్ఛ లేదు కానీ పెట్టుబడిదారీ వ్యవస్థను అదిగమించే స్వేచ్ఛ ఉంది. అంటే పెట్టుబడికి సద్యోజనితంగా (స్పాంటేనియస్‌గా) ఉన్న 'నిర్ధారిత' లక్షణం వల్ల అది మనకు దానిపై సోషల్‌ డెమోక్రటిక్‌ నియంత్రణలు పెట్టడానికి స్వేచ్ఛనివ్వదు. కానీ ఆ వ్యవస్థను మార్చే స్వేచ్ఛ మనకు ఉంటుంది.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో జనాకర్షకవాదం (పాపులిజం) పెరగడంలో లిబరలిజం పాత్రను అర్ధం చేసుకోవాలి. రాజకీయ రంగంలో ప్రజల అసంతృప్తి సోషల్‌ డెమోక్రసీ వైపు లేదా వామపక్షం వైపు మొగ్గకుండా ఇది చేస్తుంది. రాజకీయ రంగంలో శ్రామిక ప్రజల ముందు ప్రత్యామ్నాయ సంభావనలు (కాన్సెప్ట్స్‌) లేకుండా చేయడం ద్వారా అది ఈ పని నిర్వహిస్తుంది. నయా-ఉదారవాద విధానాల కాలంలో బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ టోరీల ఆలోచనా ధోరణీ, బ్లెయిర్‌ కాలంలోనూ, అంతకు ముందు జేమ్స్‌ కల్లఘాన్‌ కాలం నుండే లేబర్‌ పార్టీ ధోరణీ ఒకటే కావడం వల్ల...వలస ప్రజలు బ్రిటన్‌కు వాస్తవానికి లాభం చేకూరుస్తారన్న భావన బ్రిటిష్‌ ప్రజలకు అందకుండా పోయింది. ఇటువంటి భావనలు అందకుండా లిబరలిజం అడ్డుపడింది.

అందువల్లనే యూరోపియన్‌ యూనియన్‌ను వ్యతిరేకించిన బ్రిటిష్‌ ప్రజలు దానికి విరుగుడుగా వలసలను అడ్డుకుంటుంది అన్న భావనతో బ్రెగ్జిట్‌ను సమర్ధించారు. జరుగుతున్న పరిణామాలనుండి ప్రజలు సరైన సంభావనలు (కాన్సెప్ట్స్‌) ఏర్పర్చుకోడానికి కావలసిన మార్గాలు వారికి లేకుండా చేస్తుంది లిబరలిజం. అందువల్లనే లిబరలిజం నిజమైన వామపక్షానికి అసలైన శత్రువు. కారల్‌ మార్క్స్‌ తను రాసిన ''యూదుల సమస్య'' వ్యాసంలో ఈ విషయం చెప్పాడు.
మితవాదాన్ని లక్ష్యం చేసుకోవడం సులువు. ఎందుకంటే దాని వల్ల జరిగే నష్టాలు మన కళ్ల ముందుంటాయి. అమెరికాలో రిపబ్లికన్లు, బ్రిటన్‌లో టోరీలు తక్షణ ప్రమాదాలన్న దాంట్లో సందేహం లేదు. ఎన్నికల్లో ఇవి అధికారంలోకి వస్తే ప్రజలపై మరిన్ని భారాలు పడతాయన్న దాంట్లో కూడా సందేహం లేదు. కానీ లోతుగా పరిశీలిస్తే అసంతృప్తి చెందిన ప్రజల ముందు మితవాదం మినహా మరో మార్గం లేకుండా చేస్తున్న లిబరలిజం యొక్క పాత్ర అర్ధమవుతుంది. అందుకనే రాడికల్‌ వైఖరి తీసుకునే వారు లిబరలిజాన్ని లక్ష్యం చేసుకోవాలి. అయితే ఇదేమంత సులువైన పనికాదు. ఎందుకంటే పచ్చి మితవాదుల దుర్మార్గ విధానాలను వ్యతిరేకించడం ద్వారా లిబరలిజం నైతికంగా ఉన్నత స్థితిలో ఉంటుంది. (అదే సమయంలో సోషల్‌ డెమోక్రాటిక్‌ వైఖరులు తీసుకున్న సాండర్స్‌, కార్బిన్‌ వంటివారిపై నిప్పులు చెరుగుతూ ఉంటుంది.) అందువల్ల ప్రజల ముందు మితవాదానికి ప్రత్యామ్నాయ ఆలోచనలు లేకుండా చేయడం ద్వారా మితవాదం అభివృద్ధికి కారణమైన లిబరలిజానికి మితవాదాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. మితంవాదం అభివృద్ధి చెందడానికి మనం కార్మిక ప్రజలను తప్పుపట్టకూడదు. ఎందుకంటే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గానీ, లేక ఐరోపా యూనియన్‌కు వ్యతిరేకంగా గానీ వారిలో ఏర్పడిన అసంతృప్తిని కొత్తమార్గంలోకి నెట్టగలిగే సంభావనాత్మక (కాన్‌సెప్ట్యువల్‌) ప్రత్యామ్నాయాలు వారికి అందకుండా పోయాయి గనుక. వారిని తప్పుపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమవుతుంది. వారి రాజకీయ సంస్కృతిలో ఇటువంటి విషయాలు తెలుసుకునే అవకాశం లేకుండా చేసేవారిని మనం తప్పుపట్టాలి. ఇక్కడే మనం లిబరలిజాన్ని తప్పుపట్టాలి. అందుకే లిబరలిజం అసలు శత్రువు అని చెప్పేది.

అమెరికాలోని ప్రఖ్యాతి పొందిన ఏ విశ్వవిద్యాలయంలోని ఆర్థిక శాస్త్ర విభాగాలైనా చూడండి లిబరలిజం యొక్క ఈ దుష్ట పాత్ర కనిపిస్తుంది. ఈ విద్యాలయాల్లో ఎవరైనా రాడికల్‌ సోషలిస్టు ఆర్థిక వేత్త ఉద్యోగం పొందితే ఈ విభాగంలోని లిబరల్‌ ఆర్థిక వేత్తలు అతనిని లేక ఆమెను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఆ వ్యక్తిమీద సెన్సార్‌ పెట్టరు. లేక ఇలా చెయ్యి అలా చెయ్యి అని నియంత్రణలూ పెట్టరు. అలా చేస్తే లిబరలిజం యొక్క నైతిక ఔన్నత్యం తగ్గిపోతుంది కదా! కానీ అంతా కలిసి కట్టుగా ''పాపం ఆ వ్యక్తి 50 ఏళ్లనాటి పాతచింతకాయ పచ్చడి పట్టుకు వేలాడుతున్నారు'' అని చెప్పి పక్కన పెట్టేస్తారు. ఇక దాంతో ఉద్యోగం పట్ల ఆందోళన చెందిన ఆ వ్యక్తి రాజీ పడిపోయి తన మౌలిక ప్రత్యామ్నాయ ఆలోచనా ధోరణులను వదులుకోవడం జరుగుతుంది. పెట్టుబడి ప్రభావం నేరుగా లేని యూనివర్శిటీల్లోనే ఇలా జరుగుతుంటే ఇక మీడియాలోనూ, రాజకీయ రంగంలోనూ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

కార్మిక ప్రజలు ప్రత్యామ్నాయం వైపు వెళ్లాలంటే దేశాలు ప్రపంచీకరణ నుండి తెగతెంపులు చేసుకోవడం అవసరమని సమీర్‌ అమిన్‌, ప్రభాత్‌ పట్నాయక్‌లు చెబుతున్నారు. ఈ అంశం మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క చెడుఫలితాల నుండి తప్పుకోడానికి ఇది మొదటి మెట్టుగా భావించవచ్చు. అయితే ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చిన మార్క్సిస్టు మేధావులిద్దరూ వర్ధమాన దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. పశ్చిమ దేశాల మార్క్సిస్టుల ఆలోచనల్లో ఈ అంశం లేకపోవడం విశేషం. బ్రిటన్‌లో కార్బిన్‌ ఇటువంటి ఆలోచనలో ఉన్నట్లున్నాడు గనుకనే ఆయన బ్రెగ్జిట్‌కు దగ్గరగా వచ్చాడు కాని దాన్ని బహిరంగంగా ప్రకటించలేకపోతున్నాడు. అలా చేయలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచీకరణ నుండి విడగొట్టుకోవడం వల్ల ప్రజలు ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ప్రజలపై పొదుపు చర్యలకు దిగకుండా ధనవంతులపై పన్నులు విధించాల్సి ఉంటుంది. కార్బిన్‌ ఎన్నికల ప్రణాళికలో ఇటువంటి కొన్ని అంశాలు లీక్‌ అవడంతో లిబరల్‌ మీడియా మొత్తంగా ఆయనపై విరుచుకుపడింది. అయితే దాని వల్ల ఆయన ప్రధాన పునాది బలపడింది. ప్రపంచీకరణ నుండి విడగొట్టుకునే దేశాలు స్వావలంబన ఆదారంగా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గాన్ని రూపొందించి, ప్రజల్లో ప్రచారం చేయాలి. అభివృద్ధికి ఉన్న ఏకైక మార్గం ప్రపంచీకరణ మాత్రమే అని అనేక సంవత్సరాలుగా బ్రెయిన్‌ వాష్‌ చేయబడిన ప్రజల సంభావనా సంస్కృతి (కాన్సెప్ట్యువల్‌ కల్చర్‌)లో ఈ ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గం ఒక భాగం కావాలి. కార్మిక వర్గం ప్రపంచీకరణ వ్యతిరేక విధానం చేపడితే సరిపోదు, రాజకీయ ఆర్థికవ్యవస్థ యొక్క మౌలిక విషయాలపై ప్రత్యామ్నాయ ఆలోచనలు ప్రభుత్వ విద్య ద్వారా ప్రజల మనస్సుల్లో స్థిరపడేట్లు చేయాలి.

ప్రపంచీకరణ నుండి దేశాలు తెగతెంపులు చేసుకోవాలి అన్న విషయంలో వర్ధమాన దేశాల ఆర్థిక వేత్తలకూ, పశ్చిమ దేశాల ఆర్థికవేత్తలకూ మధ్య పూర్తి వ్యత్యాసం ఉంది. తెగతెంపులు వల్ల వర్ధమాన దేశాలు లాభపడతాయా, పశ్చిమ దేశాలు లాభపడతాయా అన్న చర్చ జరుగుతోంది. తెగతెంపులు చేసుకోవాలన్న వాదన వర్థమాన దేశాల ఆర్థిక వేత్తలనుండే వినిపిస్తోంది.

ప్రపంచీకరణ వినా మరో మార్గం లేదని పశ్చిమ దేశాల ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే తెగతెంపులు చేసుకోవడం వర్ధమాన దేశాలకూ సులభమైన విషయం కాదు. వనరులు ఎక్కువగా ఉన్న పెద్ద దేశాలు ప్రారంభ కష్టాలను తట్టుకోగలవు. కాని చిన్న దేశాలకు చాలా కష్టం. అందువల్ల చిన్న దేశాల రక్షణ కోసం వర్ధమాన దేశాలు తమ మధ్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంబంధాలు బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కూటమి) లాగా ఉండకూడదు. చైనా, భారత దేశాలు ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలతో ఏర్పరుచుకుంటున్న సంబంధాలు కొత్త సామ్రాజ్యవాదాల ఏర్పాటుకు దారితీస్తాయని కొందరు వాదిస్తున్నారు. కానీ అవి అధికార కేంద్రాలుగా ఏర్పడి పేద దేశాల మీద పశ్చిమ దేశాల అధిపత్యం మాదిరి పరిస్థితులకు దారితీసే అవకాశం లేదు. అయితే ఈ అంశాల మీద చర్చ జరగాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచీకరణ నుండి తెగతెంపులు చేసుకుంటే వర్థమాన దేశాలు బాగుపడతాయి, పశ్చిమ దేశాలు చితికిపోడానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే అలా జరిగితే వర్ధమాన దేశాల మీద గత శతాబ్దం మధ్య నుండి కొనసాగుతూ, 1980లలో పెరిగిన పశ్చిమ దేశాల ఆధిపత్యం పోతుంది కనుక.

అయితే వర్థమాన దేశాల్లో ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తుల ఆధిపత్యంలో ఉన్నాయి గనుక అవి ప్రపంచీకరణతో తెగతెంపులు చేసుకోవడం కష్టమైన పనే. ఈ దేశాల్లో వామపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి కనుక గత పావు శతాబ్ద కాలంలో కార్మికుల బేరసారాల శక్తి ఎలా తగ్గిపోయిందో చూశాం. భారత దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఇది మనకు కనిపిస్తుంది. దీనికి ఒక ప్రధాన కారణం కార్మిక వర్గాన్ని అశాశ్వత, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులుగా ముక్కలు చేయడం. రిజర్వు సైన్యం (నిరుద్యోగం) పెరగడం కూడా కార్మికుల బేరసారాల శక్తిని తగ్గించిది. నిజానికి ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నిరుద్యోగం పెరగడమే అనియత ఉద్యోగాలు పెరగడానికి కారణం. అందువల్ల ప్రపంచీకరణతో విడగొట్టుకోవడం అనేది చాలా కష్టంతో కూడిన పనే.

కానీ దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? ఇలాంటి ప్రయత్నాలకు అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ప్రతిఘటన ఏమిటి? బ్రిట్టన్‌ వుడ్స్‌ సంస్థలు (ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటివో)లు పునురుద్ధరించబడినప్పటి నుండి దేశాలు సార్వభౌమాధికారం కోల్పోతూవచ్చాయి. ఈ సంస్థలకు కోపం తెప్పిస్తే పెట్టుబడి ఎక్కడ తమ దేశాలనుండి పలాయనం చెందుతుందోనన్న ఆందోళన ఆ దేశాల లొంగుబాటుకు కారణం. ప్రతిఘటనోద్యమాల మీద దీని ప్రభావం చాలా ఆందోళనకరంగా ఉంది. ఉదాహరణకు, బ్రెజిల్‌లో లూలా డ సిల్వా అధికారంలోకి వచ్చిన విషయాన్ని తీసుకోండి. ఒక మంచి పురోగామి కార్యక్రమంతో గొప్ప కార్మికోద్యమ వెల్లువలో ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణతో ముడిపడి ఉండడం వల్ల ఆయనకు ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి ఏర్పడింది. స్వావలంబన విధానాలు అమలు పరిస్తే పెట్టుబడి పారిపోతుంది. అదే జరిగితే తీవ్రమైన నిరుద్యోగం ఏర్పడి ఆయనది బాధ్యతా రహిత ప్రభుత్వంగా ముద్రపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి ఎక్కడకు పరారైతే అక్కడల్లా దానికి వ్యతిరేకంగా కార్మిక ఉద్యమాలు జరపడానికి సిద్ధంగా ఉండాలని మైఖేల్‌ హార్ట్‌, ఆంటోనియో నెగ్రి వంటి వారు వాదిస్తున్నారు. దీన్ని వాళ్లు ప్రాంతాలకు అతీతమైన (డి టెర్రిటోరియలైజ్డ్‌) ప్రతిఘటన అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారిది కేవలం ఒక భ్రమ తప్ప మరేమీ కాదు.

అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ప్రతిఘటనా పోరాటాలకు మాత్రమే అవకాశం ఉంది. 2018 సెప్టెంబర్‌ 5న భారత దేశంలో జరిగిన కార్మిక-కర్షక (వ్యవసాయ కార్మికులతో సహా) ప్రదర్శన ఈ సందర్భంగా చాలా ప్రాధాన్యత గలది. నిర్ధిష్టమైన, కొన్ని సార్లు విరుద్ధ ప్రయోజనాలు గల ఈ రెండు గ్రూపుల మధ్య సౌహార్ద్రత ఏర్పడ్డం గమనించదగ్గది. (కర్షకులు తము పండించే వాటికి అధిక ధరలు కోరుకుంటారు, దాని వల్ల పట్టణాల్లో కార్మికుల ఆహారం ధరలు పెరుగుతాయి) ప్రపంచ స్థాయిలో ఇటువంటి సౌహార్ద్రత ఊహించడం కూడా కష్టమే. బాసుమతి ధాన్యం పండించే భారత రైతులకూ అమెరికా నగరాల్లో దాన్ని వినియోగించే ప్రజలకూ మధ్య సౌహార్ద్రత ఎలా సాధ్య పడుతుంది? కాని భారత దేశంలో కార్మిక-కర్షక సౌహార్ద్రతకు ఒక ప్రాతిపదిక ఉంది. రైతాంగం పండించే దానికి సరైన ధర రాకపోతే వారు దివాళా తీస్తారు. దాని వల్ల పట్టణాలకు వలసలు పెరగుతాయి. ఫలితంగా పట్టణాల్లో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. ఇవి కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. అందువల్ల రైంతాంగం పండించే పంటకు ధర పలకడం అనేది కార్మిక వర్గానికి కూడా ప్రయోజనకారి అవుతుంది. అందువల్ల శ్రామికుల మధ్య సౌహార్ద్రత జాతీయ స్థాయిలో మాత్రమే కుదరడానికి అవకాశం ఉంది. అయితే సియాటిల్‌, ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ వంటి ఉద్యమాల అంతర్జాతీయ సౌహార్ద్రతను కాదనలేం. కానీ ఆ ఉద్యమాలు స్థిరంగా సాగలేవు. అందువల్ల ఇటువంటి ఉద్యమాలు స్థిరంగా సాగడానికి జాతీయ స్థాయిలోనే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి ఉద్యమాలు రూపొందించిన డిమాండ్ల ఆధారంగా ఈ దేశాల్లో ఎన్నికల వేదికలు నిర్మించడం అవసరం. కానీ పెట్టుబడి పలాయనం చెందుతుందన్న ఆందోళన నయా-ఉదారవాద చట్రంలో ఈ ఉద్యమాలు జయప్రదం కావడానికి అడ్డంకిగా మారుతుంది. ఐరోపాలో గ్రీసు దీనికి ఒక ఉదాహరణ. కాబట్టి ప్రపంచీకరణతో తెగతెంపులు చేసుకోవడం అనేది ఈ దేశాల్లో ఉద్యమాల జయప్రదానికి అవసరం.

మన కాలంలో ప్రజాకర్షణవాదం తిరిగి తలెత్తడానికి ఒక కారణం ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో పరిమితులు ఏర్పడ్డమే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా వర్గ రాజకీయాలు వెనుకపట్టుపట్టడం కూడా. కార్మికుల బేరసారాల శక్తి ఎలా తగ్గించబడిందో చెప్పుకున్నాం. దాని ఫలితమే వర్గరాజకీయాలు వెనుకపట్టుపట్టడం. ఇక రెండో కారణం, వర్గరాజకీయాలతో సంబంధంలేని రకరకాల ప్రత్యేక గ్రూపులు బయలుదేరి రాజ్యంపై ఒత్తిడి పెట్టి దాని విధానాల ద్వారా ప్రయోజనాలు పొందడం. (భారత దేశంలో మండల్‌ ఉద్యమం, ఇతర అనేక గ్రూపులు ముందుకు రావడం ఈ కోవకే చెందుతుంది). ఈ రెండు కారణాలు రాజకీయాలను ప్రభావితంచేసే కొత్త ప్రజాకర్షణవాదాలను ప్రతిఘటన పోరాటాల్లోకి ప్రవేశపెట్టాయి. అమెరికాలో సాండర్స్‌ ఆ పనే చేస్తున్నాడు. ఆయన ఒకవైపు పాత పద్ధతిలో కార్మికులనూ, నిరుద్యోగులనూ సమీకరిస్తూనే, మరోవైపు విద్యా రుణాల ఊబిలో కూరుకుపోయిన విద్యార్ధులనూ, ఆరోగ్య బీమా రక్షణ లేని వృద్ధులనూ, జైళ్లలో మగ్గుతున్న నల్లజాతి ప్రజలనూ కదిలించాడు.

మితవాద ప్రజాకర్షణవాదాన్ని ఫాసిజంతో పోల్చే ధోరణులు ఇప్పుడు రాజకీయ రంగంలో కనిపిస్తున్నాయి. భారత దేశంలోనూ, హంగరీలోనూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 1930, 40 దశాబ్దాల్లో జర్మనీలోని పరిస్థితులకు సరిగ్గా పోలి ఉన్నాయని కొందరూ, లేదని కొందరూ వాదిస్తున్నారు. ఇవన్నీ విసిగించే వాదనలు. సైద్ధాంతికంగా గానీ, రాజకీయంగా గానీ ప్రేరణ నిచ్చేవి కావు.

భారత దేశంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే నాటి జర్మనీ, ఇటలీలోని కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 1) పారామిలటరీ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాన్ని వెనక ఉండి నడుపుతోంది, దాన్ని ప్రభావితం చేస్తోంది. 2) హిందూత్వ దృక్పథం వెనకనున్న స్వచ్ఛమైన బ్రాహ్మణ్యం అనేది నాటి జాతి స్వచ్ఛతను పోలి ఉంది. 3) పోలీసు, హోమ్‌ మంత్రిత్వ శాఖ యంత్రాంగం కలిసిపోయి జాతి, ప్రజ పేరుతో అసమ్మతిని అణచి వేస్తున్నాయి. అసమ్మతిని రక్షించే సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి. 4) గతమెంతో ఘనకీర్తి గల ప్రజలను సెక్యులరిజం పేరుతో కొంతమంది బయటి వ్యక్తులు (నాడు యూదులు, నేడు ముస్లింలు) మైలపరిచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 5) ఇటువంటి ప్రచారాలతో మైనారిటీలమీద, దళితులమీద సామూహిక దాడులు చేసి ఊచకోత కోస్తున్నారు. 6) దేశ వ్యాపితంగా అసంతృప్తికి లోనైన విద్యార్ధులపై ఎబివిపి నాడు ఇటలీలోని బలిల్లాస్‌ మాదిరిగా దాడులు చేస్తున్నారు. 7) చివరిగా బెనిటో ముస్సోలినీ చెప్పినట్లు రాజ్యమూ, కార్పొరేట్‌ శక్తులు కలగలిసిపోయి భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మాదిరిగా రూపుదిద్దుకున్నది.

ఇవీన్నీ చూసినప్పుడు ఐరోపాలోని ఫాసిస్టు శక్తుల లక్షణాలు కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు, కాదని కొందరు చెబుతున్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా దీన్ని ఫాసిజం అని కాకుండా రోగిష్టి నియంతృత్వం (పాథలాజికల్‌ అథారిటేరియనిజం) అని పేర్కొనవచ్చు.

దీన్ని గురించి సైద్ధాంతికంగా వివరించాలంటే ఆంటోనియో గ్రాంసీ చెప్పిన 'హెజిమోనీ' అనే పదం గురించి చెప్పుకోవాలి. ఇది ఒక టెక్నికల్‌ పదం. దీన్ని మామూలుగా చెప్పే అధికారం, ఇతరులపై ఆధిపత్యం అనే అర్థాల్లో వాడకూడదు. గ్రాంసీ చెప్పిన ప్రత్యేక అర్థంలో హెజిమోనీ అంటే ఒక వర్గం తను ఇతర అన్ని వర్గాల ప్రయోజనాలకోసంమే పనిచేస్తున్నాని ఆ ఇతర అన్ని వర్గాలనూ ఒప్పించి పాలక వర్గంగా మారడం. అందువల్ల అటువంటి హెజిమోనీ గల దేశాలు, లేక వర్గాలు నియంతృత్వంగా పిలవబడవు. నియంతృత్వ రాజ్యాలు నియంతృత్వంగా ఎందుకుంటాయంటే అక్కడ గ్రాంసీ చెప్పిన హెజిమోనీ ఉండదు కాబట్టి. భారత దేశంలో ప్రస్తుత మోడీ ప్రభుత్వం తన విధానాలు దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాలకోసమేనని ఆ వర్గాలన్నిటినీ ఒప్పించినట్లు చెప్పుకుంటున్నది. మరి అలాంటప్పుడు దేశంలోని నియంతృత్వాన్ని ఏమనాలి? రోగిష్టిది అనాలి. అందుకనే దీన్ని ఫాసిజం అని కాకుండా రోగిష్టి నియంతృత్వం అని అనవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థ, దాన్నుండి వస్తున్న సంక్షోభం ఈ రోగిష్టి నియంతృత్వం అభివృద్ధి చెందడానికి ప్రాతిపదికలు.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ డిక్షనరీ 'సత్యానంతరం' (పోస్ట్‌ ట్రూత్‌) అనేదాన్ని 2017 సంవత్సరపు విశిష్ట పదంగా ఎంపిక చేసింది. ఈ పదం, దాని వెనుకనున్న ప్రపంచ దృక్పథం ఆధునికానంతరవాదం (పోస్ట్‌మోడర్నిజం) లాగానే ఉంటాయి. ఇప్పుడు ఆధునికానంతర యుగం లేక సత్యానంతర యుగం నడుస్తోందని కొందరు వాదిస్తున్నారు. మార్క్సిస్టు మేధావి ఫ్రెడరిక్‌ జేమ్సన్‌ ఆధునికానంతర వాదాన్ని సామ్రాజ్యవాద చివరి దశయొక్క సాంస్కృతిక తర్కం అని పేర్కొన్నాడు. కానీ దేన్నయినా ఒక యుగంతోనో, కాలంతోనో పోల్చేటప్పుడు చాలా ఆలోచించాలి. నిజానికి దీన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క నయా-ఉదారవాద కాలం అని చెప్పవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థ చివరి దశ అంటే అర్ధం అదే. ఈ కాలానికి సాంస్కృతిక తర్కం అంటూ ఏమీ లేదు. దానికి ఒక నిర్థిష్ట సంస్కృతి ఉంది. నిర్ధిష్ట తర్కం ఉంది. ఈ రెంటినీ కలపడం సాధ్యం కాదు. తర్కం ఏమిటంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క నయా-ఉదారవాద దశ. ఇక సంస్కృతి ఏమంటే సర్వం సరుకుల మయం చేయడం. ఇంకా సూటిగా చెప్పాలంటే ఇది పనికిమాలిన సంస్కృతి. ఆధునికానంతరవాదం, ఈ సంస్కృతి రెండూ కూడా వాస్తవానికి దూరంగా అపభ్రంశం చెందిన అంశాలే. ఆధునికానంతర వాదం అనేది లోతులేని తత్వశాస్త్రం అని జేమ్సన్‌ చెప్పిన విషయం ఆసక్తి కరమైనది. అంతేకాదు ఆధునికవాదం (మోడర్నిజం) అనేది లోతుల్లోకి వెళ్లి శోధిస్తుందనీ, ఆధునికానంతర వాదం లోతుల్లోకి వెళ్లకుండా పైపైన చూస్తుందని జేమ్సన్‌ చెప్పాడు. ఆ విధంగా చూసినప్పుడు కారల్‌ మార్క్స్‌, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ఇద్దరూ ఆధునిక వాదులే అవుతారు.

ఇక సత్యానంతర వాదం అనేది పూర్తిగా రాజకీయాలకు సంబంధించిన విషయం. ఇది ప్రధానంగా కొన్ని దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఇటీవలి కాలంలో తలెత్తిన కొన్ని ధోరణులకు సంబంధించిన అంశం. ఇతర దేశాల్లో కూడా రానురాను ఈ ధోరణులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో రాజకీయాలకు సంబంధించి తలెత్తుతున్న కొన్ని ఆందోళనకర అంశాలకు సత్యానంతరవాదం ఉపయోగపడుతోంది.

సత్యానంతరవాదం, రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందుగా వాస్తవాలను తొక్కిపట్టడం, వాస్తవాలను ''కనిపెట్టడం'' గురించి తెలుసుకోవాలి. వాస్తవాలను తొక్కిపట్టడం అనేది రాజకీయ రంగంలో చాలా కాలం నుండి ఉంది. అధికారంలో ఉన్న వారికి సమాచారాన్ని ప్రజలకు అందించడం అంటే ఇష్టం ఉండదు. సామాన్య ప్రజలకు అధికార సమాచారం ఎంత ఎక్కువగా అందిస్తే ప్రజాస్వామ్యం అంతగా పరిఢవిల్లుతుంది. అప్పుడే ప్రజలు అన్నీ తెలుసుకుని ఓటింగులో పాల్గొంటారు. ప్రజలు అలా విజ్ఞానంతో ఓటింగులో పాల్గొనడం ధనిక వర్గాలకు ఇష్టం ఉండదు. అందువల్లనే రాజకీయాల్లోగానీ, విద్యా సంస్థల్లోగానీ ఉన్నత వర్గాలు ''నిపుణత'' గురించి మాట్లాడతారుగానీ విజ్ఞానం గురించి మాట్లాడరు. విజ్ఞానం (నాలెడ్జ్‌) పొందే సామర్ధ్యం అందరికీ ఉంటుంది. కాకపోతే వారికి వనరులు (మీడియా, విద్య వగైరా) అందుబాటులో ఉండాలి. కాని నిపుణత (ఎక్స్‌పెర్టయిజ్‌) అలా కాదు. దాన్ని కొందరే పొందుతారు. అధికారంలో ఉన్న వారు విజ్ఞానాన్ని నిపుణతగా పేర్కొంటూ అందరికీ దాన్ని అందుబాటులో లేకుండా చేస్తారు. సెన్సార్‌షిప్పుతో సమాచారాన్ని తొక్కి పెట్టేది మరో మార్గం. కార్పొరేట్‌ మీడియా వాస్తవాలను సెల్ఫ్‌ సెన్సార్‌షిప్పుతో తొక్కిపడుతుంది. అమెరికాలోని లిబరల్‌ మీడియా విదేశాల్లో తమ ప్రభుత్వం, ఇతర మిత్రులతో కలిసి చేస్తున్న అఘాయిత్యాలను గురించి ఏన్నడూ మాట్లాడదు. భారత దేశంలో కూడా ఇప్పుదు అదే జరుగుతోంది. దేశంలోని కార్పొరేట్‌ మీడియా మోడీ ప్రభుత్వం ముందు మోకరిల్లిపోయింది.
సత్యాన్ని కనుగొనడం అంటే లేని వాటిని సృష్టించడమే. ఇది సత్యాన్ని తొక్కి పట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంకన్నా ప్రమాదకరమైంది. ఇటీవలి కాలంలో ఈ ప్రమాదకర ధోరణి పెరిగింది.

 ''ఇన్‌సైడ్‌ జాబ్‌'' చిత్రంలో సత్యాన్ని ఎలా కనుగొంటారో చక్కగా చూపించారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని నివారించడం కోసం పెట్టుబడిపై ముందస్తు నియంత్రణలు పెట్టకుండా హార్వార్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలకు చెందిన ఉన్నత స్థాయి ఆర్థిక వేత్తలు ఎలా తప్పుడు సమాచారాన్ని సృష్టించారో ఇందులో చూపిస్తారు. ఇటీవల సోషల్‌ మీడియాలో ఇటువంటి ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయి గనుక ఈ సత్యానంతరవాదం గురించి చర్చించాల్సి వస్తోంది. అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ అసత్యాలు చెబుతున్నారని పలువురు అంటున్నారు. సత్యాన్ని పట్టించుకోక పోవడం వేరు, సత్యం చెప్పడాన్ని పట్టించుకోక పోవడం లేక అసత్యం చెప్పడం వేరు. అసత్యాలు చెప్పేవాడు సత్యాన్ని తొక్కిపట్టేయాలనుకుంటాడు. అందువల్లనే అతను అసత్యాలు చెబుతాడు. కానీ సత్యాన్ని పట్టించుకోని వాడు ఏదైనా విషయం సత్యమో, అసత్యమో పట్టించుకోకుండా చెప్పేస్తాడు. అసత్యాలు చెప్పేవాని మాదిరిగా ఇతను మోసం చేయాలనుకోడు. డొనాల్ట్‌ ట్రంప్‌ను రెండో కోవలోకి చేర్చవచ్చు. అయితే ఆయన అసలు అసత్యాలు చెప్పడని కాదు. లేక మోసం చేయలేదనీ కాదు. కానీ ఆయన చెప్పే అనేక అంశాలు వాస్తవమో కాదో తెలుసుకోకుండా చెప్పేస్తాడు.

సత్యాన్ని కనుగొనే ఇంకో మీడియా ఉంది. అది ఇంటర్‌నెట్‌, సోషల్‌ మీడియా. ఇందులో పూర్తిగా వదంతులను వ్యాపింపజేస్తారు. రాజకీయ విలువలను పూర్తిగా కలుషితం చేస్తూ తిట్ల దండకాలు చదువుతారు. ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టింగ్‌ కన్నా భావోద్వేగాలే సత్యాలుగా ఇందులో ప్రచారం అయిపోతుంటాయి. అబద్దం వేగంగా పరుగెడుతుంది, సత్యం తరువాత నెమ్మదిగా వస్తుంది; కాని అప్పటికే అసత్యం తాను చేయాల్సిన పని చేసేస్తుంది అనే సూత్రం మీద వీరు ఆధారపడతారు. ఇది అందరికీ ఆందోళన కలిగించే ధోరణి. ఈ టెక్నాలజీ కొత్తది కనుక ఈ పద్ధతులు కూడా ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగనివి. అంటే దానర్ధం ఇంటర్‌ నెట్‌ మొత్తంగా రాజకీయాలు, సంస్కృతి మీద చెడు ప్రభావం చూపిస్తోందని కాదు.

ఏ సాంకేతిక శాస్త్రానికైనా ఉన్నట్టు ఇంటర్‌నెట్‌కు కూడా మంచీ చెడు రెండు ముఖాలున్నాయి. ప్రధాన స్రవంతి మీడియాలో అనుమతించబడని అసమ్మతి, అభిప్రాయాలు ఇంటర్నెట్‌లో మనకు దొరుకుతాయి. క్లాస్‌ రూముల్లోనూ, సదస్సుల్లోనూ దొరకని విషయాలు దొరుకుతాయి. ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే. అయితే మనం ఎక్కువగా చెప్పుకోని అంశం ఒకటుంది. అదేమంటే పొద్దస్తమానం చాకిరీ చేసి, మైళ్లకొద్దీ ప్రయాణాలు చేసే కార్మికులకు ఇంటర్‌నెట్‌లో లోతైన విషయాలు వెదికి పట్టుకుని, ప్రధాన స్రవంతి మీడియా ఇవ్వని సత్యాలు సేకరించే తీరిక ఎక్కడిది? మహా అయితే వాళ్లు కాస్త వినోదం కోసం నెట్‌ చూడగలరు అంతే. కార్మిక ప్రజలు ప్రధానంగా వినోదం, స్పోర్ట్స్‌, సెలబ్రిటీల సమాచారం కోసం నెట్‌ ఎక్కువగా చూస్తున్నారని సర్వేలో తేలింది.

ఈ మొత్తం పరిశీలిస్తే మనం తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్థ దగ్గరకు వస్తాం. ఇంటర్‌నెట్‌ టెక్నాలజీపై ఫిర్యాదు చేయడం ద్వారా మనం ఈ సమస్యలు పరిష్కరించలేం. శ్రామిక ప్రజల జీవితాలు ఏవైతే పేదరికం, ప్రతిష్టంభన, భరించలేని చాకిరీ, పరాయీకరణ వంటి వాటిలో చిక్కుకు పోయాయో ఆ పూర్వరంగ పరిస్థితులను మార్చకుండా ఈ సమస్యల్లో ఒక్కదాన్నీ మనం సరిచేయలేం, మార్చలేం. ఈ లోతైన, మౌలికమైన అంశాలనుండి తప్పుకునే మార్గం మనకు లేదు

(తెలుగు సేత : ఎస్‌. వెంకట్రావు)